"తెర"చాటు చందమామ

సినీ సాహితీ విశ్లేషణ

వేటూరి – పాటసారి డైరీలోంచి 2

“సీతారామయ్యగారి మనవరాలు” తరువాత నేను రాసిన తెలుగు పాటల్లో నేనే తెలుగుతనాన్ని వెతుక్కోవలసిన స్థితిలో పడ్డాను – వేటూరి

వేటూరి రాసిన కొన్ని పాటల్లో నిజాయితీ కనిపించకపోవచ్చు, కానీ ఆయన మాటల్లో ఎప్పుడూ నిజాయితీ ధ్వనిస్తుంది. ఇలా నిజాయితీ నిండిన వ్యాసం ఇది. ఇందులో తెలుగు భాషపై వేటూరికున్న మమకారం, “సినీ తెలుగు భాష” గురించి ఆవేదనా కనిపిస్తాయ్. ఆయన తన కోసం రాసుకున్న పాటలూ, ఆత్మసంతృప్తి కలిగించిన పాటలూ కొన్ని మన మనసులని పలకరిస్తాయి. ఆయన అభిప్రాయాలతో ఏకీభవించినా ఏకీభవించకపోయినా స్పందించకుండా ఉండలేము. సాహితీ అభిమానులూ, వేటూరి అభిమానులూ తప్పక చదవవలసిన ఈ చక్కని వ్యాసం ఇక్కడ – http://goo.gl/j6Uz2

ETV శ్రీ భాగవతం పాటల గురించి వేటూరి

హాసంలో వేటూరి “కొమ్మ కొమ్మకో సన్నాయి” శీర్షికన రాసిన వ్యాసాల్లో తన పాటల గురించి రాసుకున్నవి ప్రచురించాను ఇప్పటి దాకా. ఇవన్నీ తర్వాత వచ్చిన “కొమ్మ కొమ్మకో సన్నాయి” పుస్తకంలో కూడా ఉన్నాయి. ఇప్పుడు ప్రచురించబోతున్న మూడు వ్యాసాల ప్రత్యేకత ఏమిటంటే అవి పుస్తకంలో లేవు. కాబట్టి ఈ వ్యాసాలు బహుశా తక్కువ మంది చదివి ఉంటారు.    (Correction: ఈ రోజే సరిచూసుకున్నాను. ఈ వ్యాసం కొమ్మకొమ్మకో సన్నాయి పుస్తకంలో ఉంది. నేను పొరబడ్డాను.)

ETV లో బాపూ రమణల భాగవతానికి వేటూరి కొన్ని పాటలు అందించారు. ఆ పాటల గురించి రాసినదీ వ్యాసం. చాలా మంచి వ్యాసం ఇది. ఎలాంటి వస్తువుకి ఎలాంటి భాష వాడాలి, తద్వారా రసపోషణ ఎలా సాధించాలి అన్నది వేటూరి వివరిస్తారు. రసపోషణ అంటే ఒక పాట విన్నప్పుడు మనలో కలిగే స్పందనగా నిర్వచించుకోవచ్చు. ఈ రసపోషణ సరిగా పాటించబడని పాటలు ఎన్నో ఉన్నాయి. నాకు గీతరచయిత చంద్రబోస్‌లో కనిపించే ప్రధానమైన లోపమే ఇది. ఆయన రాసిన కొన్ని పాటల్లో విన్నూతనంగా రాసే ప్రయత్నం వలన పాట వింటే చమత్కారం చేశాడు, కొత్తగా రాశాడు అనిపిస్తుందే తప్ప తగిన రసస్ఫూర్తి కలగదు.

శ్రీ భాగవతం పాటలు ఎక్కడైనా లభ్యమైతే తెలపగలరు. వేటూరి రాసిన వ్యాసం ఇక్కడ:  Veturi on Bhagavatam songs

శ్రీరామరాజ్యం సంగీతం – ఓ ఉడత స్పందన

ఇళయరాజా పాటలంటే ఇష్టం ఉండడం వలన ఆయన చేసిన కొత్త ఆల్బంస్ వింటూ ఉంటాను, ఏదైనా ఓ మంచి పాట ఉంటుందేమోనని. ఇళయరాజా ఇప్పుడు చేస్తున్న పాటల్లో ఒకప్పటి గొప్పతనం లోపిస్తున్నా,వెతుకుతూ ఉంటే అప్పుడప్పుడు ఓ మంచి ముత్యం దొరుకుతూనే ఉంటుంది. ఉదాహరణకి ఎవరికీ పెద్ద తెలియని "ధనం" అనే సినిమాకి చేసిన "కన్నయకు ఏది ప్రియమో" పాట ఎంతో నచ్చింది నాకు (ఇది 2008 లో తీసిన తమిళ సినిమా, ఈ మధ్యే తెలుగులో రిలీజ్ చేసినట్టు ఉన్నారు. రాగా లో తెలుగు ఆల్బం లేదు. తమిళ పాట ఇక్కడ వినొచ్చు – కన్నయ్య పాట – తమిళ్ . కృష్ణ గారు అందించిన తెలుగు పాట లింకు ఇక్కడ – కన్నయ్య పాట – తెలుగు). మొన్న "శ్రీ రామ రాజ్యం" సినిమా ఆడియో రిలీజ్ అయ్యిందంటే, సరే రాజా ఎలా చేశాడో చూద్దాం అని విన్నాను. నా స్పందనని పంచుకునే ప్రయత్నమే ఈ టపా.

ఇది ఆడియో రివ్యూ కాదు. నాకు సంగీతం గురించి బొత్తిగా తెలియదు, కేవలం ఆస్వాదించడం తప్ప. రివ్యూ కావాలంటే సోదరుడు కార్తీక్ ఎంతో చక్కగా రాసిన ఈ టపా చదవండి – కార్తీక్ రివ్యూ . సౌమ్య ఈ సినిమా పాటల గురించి రాసిన టపా ఇక్కడ- సౌమ్య రివ్యూ

మొదటి సారి విన్నప్పుడు ఏమంత గొప్పగా అనిపించలేదు పాటలు. ఓ 2-3 సార్లు వింటే కొన్ని నచ్చాయి. వినగా వినగా ఇంకా నచ్చే అవకాశం ఉంది, రహ్మాన్ పాటల్లా. ఏవో గొప్ప పాటలు చేసెయ్యాలి అన్న తపన కన్నా, లలితంగా, అందరికీ అందేలా, నచ్చేలా చెయ్యాలన్న ప్రయత్నం ఎక్కువ కనిపించింది. అసలు బాపూ సినిమాల తీరే అంత, ఓ గొప్ప కళాఖండం సృష్టిస్తున్నాం అన్న భేషజం లేకుండా సింపుల్‌గా ఉంటాయి. ఈ పాటలూ అలాగే ఉన్నాయ్. గీతరచయిత జొన్నవిత్తుల వారు కూడా తన పాండిత్యం ప్రదర్శించడం కాకుండా అలతి అలతి పదాలతో సరళమైన రచన చేశారు. మొత్తంగా ఈ సినిమా పాటలు నాకు బానే నచ్చాయి. అద్భుతం అనిపించలేదు కానీ చాలా మంచి ఆల్బం అనే అనిపించింది.

  • జగదానందకారకా – మొత్తం ఆల్బం విన్నాక ఈ పాటే నేను మొదట హం చేసింది. అయితే చిత్రంగా ఈ పాట నాకు మరీ నచ్చలేదు. ఓ రెండు సార్లు విన్న తర్వాత బాగుందనిపించింది. ఇది hit song of the album కావొచ్చు. బహుశా ఈ పాటని ఇళయరాజా రెహ్మాన్ స్టైలులో మొత్తం పాటని అందరిచేతా పాడించి మిక్స్ చేసినట్టు ఉన్నాడు. male/female, solo/chorus కాంబినేషన్ పాటంతా వినిపిస్తుంది.
  • శ్రీరామ లేరా - ఇది ఈ చిత్రానికి misfit అనిపిస్తుంది. పల్లవికి ఇచ్చిన ట్యూన్ ఆధునికంగా ధ్వనిస్తోంది. చరణాలు ఫరవాలేదు.
  • "ఇది పట్టాభిరాముని ఏనుగురా" అనే జానపద గీతం రెండు సార్లు వినిపిస్తుంది. ట్యూన్ చిన్నదే, బాణీ క్యాచీగానే ఉంది. జానపాద యాసతో పాడిన తీరులో అక్కడక్కడా కొంత సహజత్వం లోపించిన భావం కలిగింది.
  • "రామ రామ అనే రాజమందిరం" కూడా జానపద శైలిలో సాగిన పాటే. "రాజమందిరం", "రామసుందరం" లాంటి చక్కని పద ప్రయోగాలు, ఇంకా చక్కని భావాలు పొదిగారు జొన్నవిత్తుల (ఈ పాట సాహిత్యం గురించి సౌమ్య రాసిన టపా ఇక్కడ – సౌమ్య –రామరామ  ). ఈ పాటలోనూ ట్యూను హుషారుగా ఆకట్టుకునేలా ఉంది.
  • "కలయా నిజమా" అనే పాట శోకగీతం. పల్లవి గొప్పగా అనిపించింది, చరణం కొంత తేలిపోయింది. ఫీల్ కొంత తగ్గింది చరణంలో.
  • "సీతా సీమంతం" – మొదటిసారి విన్నప్పుడు బోర్ కలిగింది. వినగా వినగా బానే అనిపించింది. గాయని శ్రేయాఘోషల్ చక్కగా పాడినా ఎందుకో తన గొంతు ఇలాంటి పౌరాణిక చిత్రాలకి అంత అతకదన్న భావన కలిగింది.
  • "దేవుళ్ళే మెచ్చింది" & "రామాయణము" – ఇవి రెండూ రామాయణ కథని సంక్షిప్తంగా లవకుశలు పాడే పాటలు. చిత్రా, శ్రేయా గొప్పగా పాడారు. సాహిత్యం చాలా బాగుంది. సంగీతం కూడా సాహిత్య భావానికి తగినట్లు ఇళయరాజా చేశాడు (ఈ సినిమా పాటలన్నీ ముందు రచన, తర్వాత సంగీతం అనుకుంటా). ముఖ్యంగా ఈ చరణాలకి కుదిరిన సంగీత సాహిత్యం నాలో చాలా స్పందన కలిగించింది. ఈ సినిమాలోని ఇంకే పాటకీ ఇంత స్పందన నాకు కలగలేదు –

చెదరని దరహాసం

కదిలెను వనవాసం

వదిలి రాణివాసం

వచ్చె మగని కోసం

తండ్రీ మాట కోసం

కొడుకూ తండ్రి కోసం

భార్య మగని కోసం

లక్ష్మన్న అన్న కోసం

జనమంతా ఆక్రోశం

  • సీతారామ చరితం – ఇదీ లవకుశలు పాడే పాట అనుకుంటా. అయితే చిత్రా, శ్రేయా కాక అనితా, కీర్తనా అనే అమ్మాయిలు పాడారు. పాత లవకుశ సినిమాలో రామకథ మొత్తాన్ని ఒకే పల్లవి గల పాటలో చెప్పినట్టు గుర్తు. ఈ సినిమాలో మూడు పాటల్లో చెప్పారు. పాట చక్కగానే ఉంది.
  • గాలీ నింగీ నీరు – సీతని రాముడు వనవాసానికి పంపించేటప్పుడు వచ్చే పాట. ఈ శోక గీతాన్ని బాలు చాలా ఫీల్‌తో పాడారు. అయితే ఏడ్చినప్పుడు మాత్రం కృతకంగా అనిపించింది. జొన్నవిత్తుల సాహిత్యం ఈ పాటలో మరోసారి మెరిసింది.
  • ఎవడున్నాడు – ANR మాటలు, బాలూ గానం కలిసిన పాట. ANR గొంతులో (ఈయన వాల్మీకి పాత్ర అనుకుంటా వేసింది) గంభీరత లేకపోవడం మరి సరిపోతుందో లేదో. ట్యూన్ చాలా క్యాచీగా ఉంది.

ఇవి కాక ఇంకా కొన్ని శ్లోకాలూ, మంగళాలూ ఉన్నాయి. మొత్తంగా చూస్తే మంచి ఆల్బం అనే చెప్పాలి. సినిమాలో చూస్తే ఈ పాటలు ఇంకా బాగుండే అవకాశం కనిపిస్తోంది. నా మటుకు సాహిత్యానిదే కొంత పైచేయి సంగీతం కంటే. ఈ సినిమా వలన జొన్నవిత్తుల, ఇళయరాజా ఇద్దరికీ మరిన్ని తెలుగు సినిమాలు చేసే అవకాశం వస్తే అది మంచి పరిణామమే!

అన్నమయ్య గురించి వేటూరి

అన్నమయ్య గురించి ఎక్కువగా, అన్నమయ్య చిత్రంలో తను రాసిన పాటల గురించి తక్కువగా వివరిస్తూ వేటూరి హాసంలో రాసిన వ్యాసం ఇది. ఈ చిత్రానికి వేటూరి రాసిన పాటలు మూడే – తెలుగు పదానికి జన్మదినం, ఏలే ఏలే మరదలా, అస్మదీయ మగటిమి (అప్పట్లో ఆడియో కేసెట్‌తో పాటూ ఇచ్చిన రంగుల పాటల పుస్తకంలో "ఫాలనేత్రానల" అన్న అన్నమాచార్య కీర్తన కూడా వేటూరి రచనే అని తప్పుగా పేర్కొన్నారు).

అన్నమయ్య ప్రయోగాలపై వేటూరికి ఉన్న అవగాహన వలనే "ఏలే ఏలే మరదలా" పాటని అంత సమర్థవంతంగా రాయగలిగారని ఈ వ్యాసం చదివితే అనిపిస్తుంది (ఈ పాటకి ప్రేరణ ఏదో అన్నమయ్య కీర్తన ఉన్నట్టు గుర్తు, ఏమిటో మీకు తెలిస్తే చెప్పగలరు. అలాగే "వేణువై వచ్చాను భువనానికి" అన్న పాటకి ప్రేరణ కూడా).

"అస్మదీయ మగటిమి" పాట పానకంలో పుడకని అప్పట్లో కొందరు విమర్శించారు. అసలు సినిమాలో సాళవనరసింహరాయలు పాత్రే సరిగా చిత్రించలేదని వేటూరే ఈ వ్యాసంలో – "బాక్సాఫీస్ సూత్రాలకి, అన్నమయ్య చిత్రానికి మధ్యపడి నలిగింది" అనడం ద్వారా ఒప్పుకున్నారు. ఈ పాటని సినిమానుండీ విడదీసి ఒక శృంగార గీతంగా భావిస్తే చాలా మంచి రచనే అని అనిపిస్తుంది నాకు.

ఇక తెలుగుపదానికి జన్మదినం పాట గురించి చెప్పేదేముంది?

ఈ వ్యాసాన్ని ఇక్కడ చదవండి – http://goo.gl/Pmx4w

స్వరరాగ గంగాప్రవాహమే పాట గురించి వేటూరి

వేటూరి గొప్ప పండితులనీ, సంగీత జ్ఞానం బాగా ఉన్నవారనీ తెలిసిన విషయమే. ఒక ఉదాహరణ కావాలంటే "సరిగమలు" చిత్రంలోని "స్వరరాగ గంగా ప్రవాహమే" పాట గురించి వేటూరి హాసంలో రాసిన వ్యాసం చదివితే చాలు. ఈ వ్యాసం ఇప్పటికి నేను చాలా సార్లు చదివినా, నాకు చదివిన ప్రతిసారీ కొత్త విషయం ఒకటి బోధపడడం, అర్థం కానిది కొంత మిగిలిపోవడం జరుగుతూనే ఉంది. ముఖ్యంగా రెండవ చరణానికి ఇచ్చిన వివరణ అబ్బురపరుస్తుంది.

మంచి బాణీలు ఉంటే, రచయితకి ప్రేరణా, ప్రాణం వచ్చి గొప్ప సాహిత్యం పుట్టే అవకాశం ఎక్కువ ఉంది. ఈ సినిమాలో అన్ని పాటలూ మథురాలే. అన్నీ గొప్ప రచనలే. వేటూరికి 1993 తర్వాత నందీ పురస్కారాలు కానీ, మనస్విని పురస్కారాలు కానీ ఏమీ రాలేదు. చివరి రెండు దశకాల్లో ఆయన అవార్డులివ్వదగ్గ పాటలు ఎన్నో రాశారనడానికి 1994 లో వచ్చిన ఈ సినిమా ఒక ఉదాహరణ.

ఈ పాటపై వేటూరి వ్యాసం ఇక్కడ చదవండి – http://goo.gl/3R7Dt

YouTube లో ఈ పాట ఉన్న ఒక లింక్ –

గలగలగల గంగోత్రి పాట గురించి వేటూరి

గంగోత్రి సినిమాలో వేటూరి రాసిన “గలగలగల గంగోత్రి” పాటని తలచుకుంటే కొన్ని సంగతులు గుర్తుకు వస్తాయి. అప్పట్లో idlebrain.com సైట్లో శ్రేయ అన్నావిడ(?) ఆడియో రివ్యూస్ రాస్తూ ఉండేవారు. సిరివెన్నెలపై అభిమానం, వేటూరిపై దురభిమానం తనకి ఉందని చాలా పోస్టుల్లో నాకు అనిపించేది. నాకు ఈ వివక్ష నచ్చేది కాదు. అలాంటి ఆవిడే ఈ పాట గురించి – the veteran did a good job అని పొగడ్డం నాకు ఆనందాన్నిచ్చింది. హాసం రాజా ఈ పాట గురించి రాస్తూ – “వేటూరి ఈ పాటకి వాడిన భాష చూస్తే కన్నీటితో ఆయన పాదాలు కడగాలనిపిస్తుంది” అన్నారు. అప్పట్లోనే వార్త దినపత్రికలో వి.ఎ.కె రంగారావు గారు “ఆలాపన” అనే శీర్షిక నిర్వహిస్తూ ఉండేవారు. ఒక పాఠకుడు – “వేటూరి గంగని గంగోత్రని సంబోధించి తప్పులు రాశాడు” అంటే రంగారావుగారు – “అవును ఆయనకి అలవాటేగా! కలకత్తా గురించి “యమహానగరి” పాటలో తప్పులు చేసినట్టే ఇక్కడా” అని అక్కసుతో అన్నారు. పాటలో మిగతా మంచి వదిలేసి, ఏదో సినిమా సౌలభ్యం కోసం చేసిన మార్పుకి ఇంత రామాయణంలో పిడకలవేట అవసరమా అని నాకనిపిస్తుంది.ఏదేమైనా ఇది గొప్ప పాటేనని ఒప్పుకుని తీరాలి. కీరవాణి చాలా మంచి ట్యూన్ ఇచ్చారు. గమనిస్తే ఈ పాటలో ఒక పల్లవి, రెండు చరణాల standard structure లేదని తెలుస్తుంది. గంగానది లాగే ఒక free flow లో ఈ పాట దర్శనమిస్తుంది. ఈ పాట రచన గురించి వేటూరి ఏమన్నారో ఆయన మాటల్లోనే ఇక్కడ చదవండి: గలగలగల గంగోత్రి

సౌలభ్యం కోసం ఈ పాట పూర్తి సాహిత్యం కింద ఇస్తున్నాను:

సాకీ:
జీవనవాహినీ పావనీ
కలియుగమున కల్పతరువు నీడ నీవని
కనులు తుడుచు కామధేను తోడు నీవని
వరములిచ్చి భయముతీర్చి శుభముకూర్చు గంగాదేవి
నిను కొలిచిన చాలునమ్మ సకల లోకపావనీ
భువిని తడిపి దివిగ మలచి సుడులు తిరుగు శుభగాత్రి గంగోత్రి

పల్లవి:
గలగలగల గంగోత్రి హిమగిరిజని హరిపుత్రి

పసుపు కుంకుమతో
పాలు పన్నీటితో
శ్రీగంధపు  ధారతో
పంచామృతాలతో
అంగాంగం తడుపుతూ
దోషాలను కడుగుతూ
గంగోత్రికి జరుపుతున్న
అభ్యంగన స్నానం

చరణం 1:
మంచు కొండలో ఒక కొండవాగుగా
ఇల జననమొందిన విరజావాహిని
విష్ణుచరణమే తన పుట్టినిల్లుగా
శివగిరికి చేరిన సురగంగ నీవని
అత్తింటికి సిరులనొసగు అలకనందవై
సగరకులము కాపాడిన భాగీరధివై
బదరీవన హృషీకేశ హరిద్వార ప్రయాగముల
మణికర్ణిక తనలోపల వెలసిన శ్రీవారణాసి గంగోత్రి

|| గలగలగల గంగోత్రి హిమగిరిజని హరిపుత్రి ||

అమ్మా  గంగమ్మా
కృష్ణమ్మకి చెప్పమ్మా
కష్టం కలిగించొద్దని…
యమునకి చెప్పమ్మా
సాయమునకి వెనకాడొద్దని…
గోదారికి కావేరికి
ఏటికి సెలయేటికి
కురిసేటి జడివానకి
దూకే జలపాతానికి
నీ తోబుట్టువులందరికీ
చెప్పమ్మా మా గంగమ్మా

చరణం 2:
జీవనదివిగా ఒక మోక్షనిధివిగా
పండ్లుపూలుపసుపుల పారాణిరాణిగా
శివునిజటలనే తన నాట్యజతులుగా
జలకమాడు సతులకు సౌభాగ్యదాత్రిగా
గండాలను పాపాలను కడిగివేయగా
ముక్తినదిని మూడుమునకలే చాలుగా
జలదీవెన తలకుపోసె జననీ గంగాభవాని
ఆమె అండ మంచుకొండ వాడని సిగపూదండ

|| గలగలగల గంగోత్రి హిమగిరిజని హరిపుత్రి ||

“పుచ్చా పువ్వుల విచ్చే తావుల” పాట గురించి వేటూరి

వేటూరి హాసం పత్రికలో “కొమ్మకొమ్మకో సన్నాయి” శీర్షికన కొన్ని వ్యాసాలు రాశారు. తర్వాత ఈ వ్యాసాలు అదే పేరుతో పుస్తకంగా వచ్చాయి (అయితే హాసంలో వేటూరి రాసిన కొన్ని వ్యాసాలు పుస్తకంలో లేవు). గంగోత్రి సినిమాలోని “గలగలగల గంగోత్రి” పాట వివరణతో మొదలుపెట్టిన వేటూరి, మరికొన్ని గీతాలనూ వివరించారు. అయితే ఓ 3-4 సంచికల తర్వాత ఎందుకో తన గీతాల గురించి ఇక రాయడం మానేసి సినీప్రముఖులపై తన అభిప్రాయాలనీ, అనుబంధాన్ని గురించి రాయసాగారు. అది జూన్ సంచికైతే ఆ నెలలో పుట్టిన ఓ ప్రముఖుని గురించి రాయడం, ఇలా సాగింది. నా వరకూ అయితే వేటూరి పాటల గురించి రాస్తేనే ఎంతో ఆసక్తిగా ఉండేది, అయినా ఏం చేస్తాం పత్రికకు సంపాదకులూ, ఎడిటర్లూ ఉంటారు కదా, వారు నిర్దేశించిన పథంలో సాగాలి మరి!

వేటూరి హాసం వ్యాసాల్లో తన పాటల గురించి రాసుకున్న వ్యాసాలని నేను స్కాన్ చేసి సినీసాహితీ అభిమానులకోసం వారం వారం అందించే ప్రయత్నం చేస్తున్నాను. “కొమ్మకొమ్మకో సన్నాయి” పుస్తకంలో లేని కొన్ని వ్యాసాలు కూడా ఇందులో ఉన్నాయి. ఈ వారం “మనోహరం” చిత్రంలోని “పుచ్చా పువ్వుల” అనే పాట గురించి వేటూరి రాసిన సమగ్ర వ్యాసం.

స్వయంగా వేటూరి వారే తన పాట గురించి వివరిస్తుండగా మధ్యలో నా గోల అనవసరమే. అయితే ఉబలాటం కొద్దీ కొన్ని విషయాలు పంచుకుంటాను -

  1. వేటూరి ఈ పాటని తన “గాలి పాటల్లో” ఒకటంటారు. గాలి పాటకే ఇంత ఘుమఘుమ ఉంటే మరిక ఏమనాలి? పైగా ఈ పాట బాణీ వేటూరిదే అన్నది మరో విషయం.
  2. వేటూరికి ఉన్న గొప్ప విషయపరిజ్ఞానం ఈ వ్యాసంలో కనిపిస్తుంది. కవికి, అదీ సినిమా కవికి, కొంత ప్రతిభా, పదసంపదా ఉంటే చాలా, లేక అన్ని విషయాలపై కొంత సమగ్ర అవగాహన ఉండాలా అని ఒక ప్రశ్న. ఎక్కువ తెలుసుకుంటే ఆ తెలుసుకున్న దాన్లోనే పడి తిరగడం తప్ప సృజనాత్మకతకి పెద్ద స్థానం ఉండదని కొందరి అభిప్రాయం. ఇందులో కొంత నిజం లేకపోలేదు. అయితే దీనర్థం ఏమీ తెలుసుకోకూడదనీ కాదు. రెంటినీ బ్యాలన్స్ చెయ్యడం ఎలాగో వేటూరి వంటి వారు ఎలాగూ దారి చూపించారు.
  3. వచనంలో కూడా వేటూరి దిట్టని ఈ వ్యాసం మళ్ళీ నిరూపిస్తుంది. ప్రకృతి వర్ణన ఎంతో రమణీయంగా చేశారు.
  4. ఈ పాటని అనుభూతి చెందాలి. ఆ భావంలో నిమగ్నమవ్వాలి. పల్లెలూ, ప్రకృతి సౌందర్యాలతో అంతగా పరిచయం లేని నాబోటి వారు ఊహల్లోనే ఈ పాటని ఎంతో కొంత మరి అనుభూతి చెందాలి. అందుకే వేటూరి గర్వంగా ఈ అద్భుతచిత్రాలన్నీ దర్శించిన జన్మ నాది అని చాటుకున్నారు. అవును వేటూరి గారూ, మీరు ధన్యులు!

Google docs లో ఈ స్కాన్ చేసిన PDFని షేర్ చేస్తున్నాను – మనోహరమైన పాట . డౌన్లోడ్ చేసుకోండి, చదవండి, ఆస్వాదించండి, మిత్రులకి పంచండి!

వేటూరిని ఎలా స్మరించుకోవాలి? – సిరివెన్నెల సీతారామ శాస్త్రి

(ఈ రోజు (మే, 22, 2011) వేటూరి గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా, సిరివెన్నెల వేటూరి పోయినప్పుడు రాసిన ఓ ప్రచురితం కాని వ్యాసం నుంచి కొన్ని వాక్యాలు గ్రహించి ఇది చేశాను. ఈ టైటిల్ నాది. మాటలన్నీ సిరివెన్నెలవి!)

ఈనాడు మన తెలుగుసమాజంలో అనేకమంది పండితసమానులూ, మహామహులమనుకుంటున్న వారి దృష్టిలో “ఆఫ్ట్రాల్” అనిపించే సినీగేయ రచన ద్వారా శ్రీ వేటూరి వారు (ఆయన పేరు ముందు కీ.శే అని చేర్చడం నాకు ఇష్టం లేదు. ఆయన తన గీతాల ద్వారా శాశ్వతుడు) ఎంతో స్ఫూర్తి కలిగించారు…

నేనైనా, మరెవరైనా, ఎంత వారైనా సాహిత్యాన్ని “ఉద్దరించ”గలిగేంత అవతారపురుషులు ఎవరూ ఉండరు. కాలప్రవాహంలో ఎంతోమంది వస్తూ ఉంటారు, వెళుతుంటారు. అతి కొద్దిమంది మాత్రం శ్రీ వేటూరి గారిలా కాలాన్ని అధిగమించి శాశ్వత స్థానాన్ని శాసిస్తారు. ఆయన తర్వాత తరానికి చెందిన నాబోటి వాళ్ళు ఆయన సాధించిన ఆ ఘనతని ఆదర్శంగా, గమ్యంగా భావించి ఆ మార్గంలో ప్రయాణించడానికి ప్రయత్నించాలి…

…ఎవరెస్టు శిఖరం ఒక్కటే ఉంటుంది. మొదట ఎవరు అధిరోహించారు అన్నదే చరిత్ర. తరువాత మరికొందరు ఆ శిఖరాన్ని అధిరోహించడం అన్నది చరిత్ర కాదు. శ్రీ వేటూరి గారు తొలిసారి ఎవరెస్టుని అధిరోహించారు…

వ్యక్తుల పట్ల కన్నా వారు నెలకొల్పిన “విలువల” పట్ల దృష్టి మళ్ళించాలి. సాహిత్యం శాశ్వతం, సాహితీకారుడు కాదు. పాట శాశ్వతం, “పాటసారి” కాదు.

సిరివెన్నెలతో మరో సాయంత్రం

ఈ రోజు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారిని ఆయన పుట్టినరోజు సందర్భంగా కొందరు మిత్రులతో పాటూ కలవడం జరిగింది. ఓ మూడు గంటలు ఆయన సమక్షంలో గడిపే భాగ్యం దక్కింది. గతంలో ఒకసారి ఆయన పుట్టినరోజుకే ఇలా మిత్రులతో కలిశాను. ఆ అనుభవాలని “సిరివెన్నెలతో ఓ సాయంత్రం” పేరున విపులంగా బ్లాగీకరించాను. ఇప్పుడు ఆ వ్యాసాలు చదివితే నేను మరిచిపోయినవి చాలా ఉన్నాయని తెలిసింది. సిరివెన్నెల గారితో సమయం గడిపితే మనలో నూతన ఉత్సాహం, ప్రేరణ కలుగుతాయ్. ఈ రోజు జరిగిన ముఖాముఖీలో నేను నేర్చుకున్న విషయాలు నాకు గుర్తున్నంతలో/అర్థమైనంతలో క్లుప్తంగా వివరిస్తాను. ఇది నాకోసం, అందరి కోసం కూడా!

  • పాటని సినిమా కోసం కాదు, నీకోసం రాసుకో. మనకోసం రాసుకున్నదే సినిమావాళ్ళకి నచ్చేలా ఒప్పించగలగడంలోనే కళా, కౌశలం దాగున్నాయి. ఒక రకమైన వస్తువుకే/అంశానికే పరిమితం కాకు. మనసుని స్పందింపజేసే అన్నిటిమీదా, జీవితంలోని ప్రతి అనుభవం మీదా రాస్తూ సాధన చేస్తూ ఉండు – అన్న నచకికి అభినందనపూర్వకంగా ఇచ్చిన సలహా.
  • పంచతంత్ర కథలూ, అరేబియన్ నైట్స్ వంటి కథల్లో చాలా జీవితం ఉంది -

    ఆలీబాబా కథలో నీతి ఏమిటంటే – నీకు కావలసిందేదో, ఎంతో తెలుసుకోమని. నలభై దొంగలూ సొమ్మైతే చాలా దోచారు కానీ వారి దృష్టిలో వాటి విలువ సున్నా. దొంగతనం వృత్తిగా చేస్తున్నారంతే. ఆలీబాబా అన్న అత్యాశకి పోయి మొత్తం సొమ్మంతా కావాలనుకుని, ఆ తొందరలో మంత్రం మరిచిపోయి దొంగల చేతిలో చచ్చాడు. చివరికి ఆలిబాబా దొంగలను గెలిచి తీసుకున్న సొమ్మెంత? రెండు జేబుల సరిపడా. బతకడానికి ఎంత సొమ్ము కావాలో అతనికి తెలుసు.

    అల్లాదీన్ కథలో, అల్లాదీన్ అద్భుతదీపాన్ని రెండు సార్లే వాడాడు. రాకుమారిని దక్కించుకోడం కోసం ఒకసారీ, రక్షించుకోడం కోసం ఇంకోసారి. అంతే కానీ నా పనులన్నీ నువ్వే చెయ్యి, నా తిండి నువ్వే తిను, నాకు ఇవితే, అవితే అనలేదు. నీ శక్తికి మించిన దానికి సాయం కావాలి కానీ, జీవించడానికి ఎందుకు?

  • dichotomy(ద్వంద్వత) లేకుండా జీవించాలి. జనం, సమాజం మిమ్మల్ని ఎలా ఉండాలనుకుంటోందో అలా ఉంటున్నవాళ్ళే ఎక్కువ. మీకేం కావాలో మీరు తెలుసుకోండి, మీలా మీరు ఉండండి.
  • ప్రతి వ్యక్తి గొప్పతనం వెనకా ఒక వ్యవస్థ ఉంది. గాంధీ, థెరీసా గొప్పవాళ్ళే, కానీ వాళ్ళ గొప్పతనానికి దోహదం చేసిన పరిస్థితులనూ, సమాజాన్ని మర్చిపోరాదు. అందుకే సిరివెన్నెల కూడా ఒక వ్యక్తి కాదు, వ్యవస్థ. జగమంత కుటుంబం అంటే ఇదే. ఈ ప్రపంచం అంతా నేనే, నేనే ప్రపంచం అనుకుని చూడండి – మీలో గొప్పతనం బయటకి వస్తుంది.
  • మీరు నాకు ఫేన్స్‌గా ఉండకండి, ఆ మాటకొస్తే ఎవరికీ ఫేన్స్ కావొద్దు. మీరే ఒక హీరో అవ్వండి.
  • Anything that becomes organized loses its power. జిడ్డు కృష్ణమూర్తి అందుకే తన ఆధ్యాత్మిక హోదానీ, మఠ సారధ్యాన్ని త్యజించాడు. నిరంతరం తర్కిస్తూ, నిరంతరం నేర్చుకుంటూ ఉండండి. ఒక ఆలోచనా ధోరణికో, ఒక సంస్థకో బద్ధులు కాకండి.

ఈ meeting లో మరికొన్ని విషయాలు -

  • గురువుగారు ఎంతో గౌరవించే “సత్యారావు మాస్టారు” గారు మాతో ఉండడమే ఈ పుట్టినరోజు విశిష్టత అని మాతో చెప్పారు. ఒక శిలని, గుళ్ళో శిల్పంగా మలిచిన ఘనత మాస్టారికే దక్కుతుందన్నారు. “జగమంత కుటుంబం నాది” పాటకి సజీవ ఉదాహరణ మాస్టారన్నారు. మాస్టారు మాట్లాడుతూ – “అంతా సిరివెన్నెలే చేసినది. నేనందించింది కొద్ది తోడ్పాటు మాత్రమే. సాధారణంగా గెలుపు తనవల్లేననీ, పరాజయం అందరివల్లా అనీ జనం భావిస్తారు. సిరివెన్నెల మాత్రం తన గెలుపు అందరి వల్లా అని చెప్పడం ఆయన సంస్కారం” అన్నారు.
  • గురువుగారు సినిమా రంగంలోకి వచ్చి పాతికేళ్ళు పూర్తైన సందర్భంగా మాస్టారు ఒక 4 రోజుల కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు. 3 రోజులు విశాఖలో – సిరివెన్నెల అమ్మపైన, స్నేహం పైన, యువత పైనా, సమాజం పైన ఇలా వివిధ అంశాలపై రాసిన పాటలు గానం చేస్తారు. 1 రోజు హైదరాబాద్ లో సిరివెన్నెల తను పనిచేసిన దర్శకులు, సంగీత దర్శకులూ, హీరోల గురించి అనుభవాలను వివరిస్తారు.
  • మమ్మల్ని మాస్టారికి పరిచయం చేస్తూ – “వీరంతా చక్కని కుర్రాళ్ళు. యూత్ అంటే ఈ ఒక్క సినీ పరిశ్రమకే సదాభిప్రాయం లేదు. వాళ్ళు తాగుబోతులనీ, తిరుగుబోతులనీ, ఎందుకూ పనికిరారన్నట్టే చూపిస్తారు. వీళ్ళందరిలో ఏ ఒక్క అవలక్షణం లేదు. వీరే నాకు దక్కిన నిజమైన అవార్డులు. అంతే కానీ ఆ అవార్డు చెక్కముక్కలు కాదు” అన్నారు. గురూజీకి మాపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టడానికి అయినా నాలో కొన్ని మార్చుకోవాలన్న సంకల్పం కలిగింది.
  • గురువుగారు ఈ మధ్యే రాసిన పాటలోని ఓ రెండు వాక్యాలు ఆయనే హాస్యనటులు బ్రహ్మానందం గారితో ఫోన్‌లో మాట్లడుతున్నప్పుడు చెప్పడం జరిగింది -

               మన భాష మనసుకు తెలుసా

               మదిఘోష మనిషికి తెలుసా!

  • రామ జోగయ్య శాస్త్రి గారు వారి ఇద్దరి అబ్బాయిలతో వచ్చారు. వారి రెండవ అబ్బాయిని (పదేళ్ళు ఉంటాయేమో) సిరివెన్నెల మాకు పరిచయం చేస్తూ – “వీడు child prodigy. ఎలాంటి సన్నివేశం అయినా చెప్పండి, వెంటనే ట్యూన్ చెప్పేస్తాడు. హార్మోనియం పెట్టె ముందేసుకుని, ట్యూన్లు ఇవ్వడం అంటే అదో గొప్ప ఘనకార్యం అన్నట్టు ఫోజులు కొట్టే మ్యూజిక్ డైరెక్టర్లకి వీడిని చూసి బుద్ధి రావాలి.” అన్నారు. తర్వాత ఈ child prodigy తన ప్రతిభని మా ముందు ప్రదర్శించి అబ్బురపరిచాడు. గురువుగారు ఇచ్చిన ఒక అసాధారణ సన్నివేశానికి, గురువుగారు చెప్పడం పూర్తిచెయ్యగానే ఆశువుగా “తననా”లతో ట్యూన్ కట్టాడు. మేము గురువుగారి రూం నుండి బయటకి వచ్చాక RJS గారు ఈ అబ్బాయికి ప్రేమగా నుదుటిపై ముద్దుపెట్టడం చూసి ముచ్చటేసింది.

తెలియడం వేరు, ఆచరణలో పెట్టడం వేరు. గురువుగారి వాక్కులో శక్తి ఉంది. తెలిసిన విషయాలనే, ఆయన ద్వారా విన్న విషయాలనే అయినా మళ్ళీ ఒకసారి వింటే కొత్త ఉత్సాహం కలుగుతుంది. తీర్థం ప్రాప్తమయ్యింది, ప్రస్థానం మొదలుపెట్టాలి.

ఆనందం కలిగినపుడు అదే ఆమని!

కొంత కాలం విరామం తర్వాత మళ్ళీ ఈ బ్లాగులో పోస్ట్ చెయ్యడం, ఉగాదితో ఒక శుభప్రారంభం చెయ్యడం జరుగుతోంది. అంతగా ప్రాచుర్యం పొందని గొప్ప పాటలని పరిచయం చెయ్యడం ఈ బ్లాగు ముఖ్యోద్దేశం. అంతగా తెలియని ఉగాది పాట ఏమిటా అని ఆలోచిస్తే గుర్తొకొచ్చిన పాట ఇది. ఇది సినిమా పాట కాదు, ప్రైవేట్ గీతం కావొచ్చు. నేను ఇంజనీరింగ్ చదవుకునే రోజుల్లో  (1998-2002) వార్త దినపత్రికలో ఈ ఆరుద్ర గీతం చదవగానే నా మనసు పరిమళించింది. దీని స్వరకర్త సాలూరు కబీర్‌షా గురించి నాకు అసలు తెలియదు. ఈ పాట గురించి నెట్ లో వెతికాను గానీ వివరాలు ఏమీ దొరకలేదు. మీకు తెలిస్తే చెప్పగలరు.

కొన్ని పాటలు విశ్లేషణ చేస్తున్న కొద్దీ ఎక్కువ ఆనందాన్ని ఇస్తాయి. మరికొన్ని పాటలని ఆస్వాదించడానికి విశ్లేషణ అడ్డుగా మారుతుంది. ఈ రెండో కోవకి చెందిన పాట ఇది. లలితమైన పదాలతో ఆరుద్ర అల్లిన ఈ రసరమ్య గీతాన్ని అనుభూతి చెందండి.  ఖర నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.

రచన: ఆరుద్ర

సంగీతం: సాలూరు కబీర్‌షా

ఆనందం కలిగినపుడు అదే ఆమని

అయిన వాళ్ళు నవ్వినపుడు అదే ఆమని

అతని చేయి సోకినపుడు ఆమె ఎడద సోలినపుడు

ఆత్మీయులు మురిసినపుడు అదే ఆమని

వేయిడొలలొక్కసారి ఊగినట్లుగా

తీయనైన లోకాలను తేలినట్లుగా

దోరవయసు తోటవోలె విరిసినట్లుగా

తోచినపుడు ఎపుడైనా అదే ఆమని

పదునుదేరి పడుచుదనం పాడినట్లుగా

హృదయంలో సన్నాయిలు ఊదినట్లుగా

తనలోపలి శశికాంతులు తరగనట్లుగా

తలచునపుడు ఎపుడైనా అదే ఆమని

కోరికలే కోయిలలై కూసినట్లుగా

కొత్త కొత్త మురిపాలే కురిసినట్లుగా

పరవశాన జన్మంతా పండినట్లుగా

భావిస్తే ఎపుడైనా అదే ఆమని

Follow

Get every new post delivered to your Inbox.