కన్నానులే, కలయికలు ఏనాడు ఆగవులే!

రెహ్మాన్ పాటల్లో నాకు ఎంతో ఇష్టమైన పాట “బొంబాయి” చిత్రంలోని “కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే అన్నది. నా దృష్టిలో ఇది వేటూరి రాసిన గొప్ప పాటల్లో ఒకటి. కానీ చిత్రంగా ఈ పాట సాహిత్యం చాలా అపార్థాలకి దారితీసింది. ఓ మూడు సంఘటనలు చెప్తాను. 

  1. నేను ఇంటర్ చదువుతున్నప్పుడు మా కాలేజీ ఫంక్షన్‌లో ఓ అమ్మాయి ఈ పాట తమిళ్‌లో పాడుతూ ఉంటే నా వెనుక కూర్చున్న ఇద్దరు కుర్రాళ్ళు ఆ అమ్మాయి గురించి కామెంట్ వేస్తూ చులకనగా అన్న మాటలు –  “తెలుగులో పాడితే పాటలోని బూతులు తెలిసిపోతాయని తమిళ్‌లో పాడుతోందిరా!”. సినిమాలో కొత్తగా పెళ్ళైన స్నేహితురాలిని సరసంగా ఆటపట్టిస్తూ అమ్మాయిలు పాడే లైన్లు ఈ పాటకి కోరస్‌గా వస్తాయి. “మామకొడుకు రాతిరికొస్తే వదలకు రేచుక్కో!” వంటి వాక్యాల వల్ల కాబోలు ఇది “బూతు పాట” గా తీర్మానించారు నా వెనుకసీటు అబ్బాయిలు! ఇది పూర్తిగా తప్పు! నిజానికి పాటలోని అంశానికీ ఈ కోరస్‌కి సంబంధం లేదు. అందుకే ప్రస్తుత వ్యాసంలో కోరస్ ని చర్చించకుండా వదిలేస్తున్నాను.
  2. కోరస్ శృంగారపరంగా ఉంది కాబట్టి పాట కూడా శృంగార గీతమే అని చాలామంది పొరబడతారు. నేను చెన్నై I.I.T.లో చదివే రోజుల్లో ఏటా జరిగే సంగీత ఉత్సవం “సారంగ్” లో ఒక అమ్మాయి ఈ పాటని తమిళ్‌లో చాలా ఫీల్ అయ్యి హావభావాలతో శృంగార తాదాత్మ్యంతో పాడింది. సాహిత్యంలో కొన్ని వాక్యాలు శృంగారంతో ఉండడం వల్ల కాబోలు ఆ అమ్మాయి ఈ పాటని శృంగార గీతం అనుకుంది. కానీ నా దృష్టిలో ఇది శృంగార గీతం కాదు. ఒక ముస్లిం అమ్మాయి, ఒక హిందూ అబ్బాయిపై పడ్డప్పుడు తనలో తాను ఎదుర్కొనే సంఘర్షణ ఈ పాట. సామాజిక కట్టుబాట్లకి తలొగ్గాలా, ప్రేమ వైపు ఒగ్గాలా అన్న ఆలోచన సరదా విషయం కాదు, తీవ్రమైనది. ప్రేమలో పడిన ఆ అమ్మాయి తనని తాను అద్దంలో చూసుకుంటూ తనలోని భావాలన్నిటినీ (ప్రేమా, శృంగారం, విరహం, శోకం వగైరా) నిజాయితీగా పరామర్శించుకునే సీరియస్ పాట ఇది! అందుకే గాయని చిత్ర ఈ పాటలోని “జారె జలతారు పరదా కొంచెం కొంచెం ప్రియమగు ప్రాయాల కోసం” అని పాడేటప్పుడు నవ్వే నవ్వు రసభంగంగా అనిపిస్తుంది నాకు!
  3. చాలా రోజుల వరకూ నాకీ పాటలోని కొన్ని లైన్లు అర్థమయ్యేవి కావు. ఓ రోజు “పాడుతా తీయగా” చూస్తుంటే ఎవరో ఈ పాట పాడారు. SPB ఈ పాట సాహిత్యం గురించి వివరిస్తాడేమో అని నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూశాను. తీరా చూస్తే SPB, “ఏమిటో! వేటూరి ఇష్టం వచ్చినట్టు పదాలు కూర్చేశాడు. నాకో ముక్క అర్థం కాలేదు!” అని తేల్చేశాడు! వేటూరి అర్థంపర్థం లేని పాటలు రాసిన మాట నిజమే కానీ మంచి సంగీతం, సందర్భం కుదిరినప్పుడు మనకి అర్థం కాకపోయినా ఆయన అర్థవంతంగానే రాస్తాడు అని నా నమ్మకం. కొంచెం పరిశ్రమిస్తే ఈ పాట నాకు బాగానే అర్థమైంది. చాలా గొప్పగా ఉందనిపించింది. నాకు అర్థమైనది మీతో పంచుకోవాలనే ఈ వ్యాసం!

 పల్లవిలోనే కనిపించే కవిత్వం, పాటంతా తర్వాత దట్టంగా పరుచుకుంటుంది – 

కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే

నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసలివే

అందాల వయసేదొ తెలితామరై, విరబూసె వలపేదో నాలో

నీ పేరు నా పేరు తెలుసా మరీ, హృదయాల కథ మారె నీలో

వలపందుకే కలిపేనులే, ఒడిచేరె వయసెన్నడో

 

ఈ ప్రేమ “తొలిచూపు ప్రేమ”, హృదయాలను సూటిగా తాకిన ప్రేమ. అందుకే “తొలిచూపు కలయికలు” అంతటితో ఆగిపోవు అంటోంది. ఆ అబ్బాయికి తనపైగల ఆరాధన అమ్మాయికి చెప్పకనే తెలిసిపోయింది! మగవాడి కళ్ళలోని భావాలని (నీ కళ్ళలో పలికినవి…) ఆడవాళ్ళు ఇట్టే పసిగట్టగలుగుతారు – అది ప్రేమ అయినా, కాంక్ష అయినా! కాబట్టి ఇద్దరూ ఒకే స్థితిలో ఉన్నారు. తెల్లని తామరలా విరిసిన ఆమె వయసుకి సుగంధంలా దరిచేరిందీ ప్రేమ! ఎవరెవరో తెలియకపోయినా అతని హృదయం గల్లంతైంది! ఊరూ, పేరూ, వివరాలు తెలుసుకుని ప్రేమించేది ప్రేమవ్వదు! వయసు వచ్చి చేరాకా, వలపు గుండె తట్టాకా, ఝల్లుమనని జన్మ ఉంటుందా? 

ఉరికే కసివయసుకు శాంతం శాంతం తగిలితె తడబడె అందం

జారె జలతారు పరదా కొంచెం కొంచెం ప్రియమగు ప్రాయాల కోసం

అందం తొలికెరటం; చిత్తం తొణికిసలై నీటి మెరుపాయె

చిత్తం చిరుదీపం; రెపరెప రూపం తుళ్ళి పడసాగె

పసి చినుకే ఇగురు సుమా, మూగిరేగే దావాగ్ని పుడితే

మూగె నా గుండెలో నీలి మంట 

ఉరికే వయసుని ప్రేమ చల్లగా తాకింది. కానీ దాని వల్ల కుదురు రాకపోగా తడబాటు పెరిగింది. ఏదో కొత్త ధైర్యం కూడా వచ్చింది. అందుకే ప్రాయం కోసం, ప్రణయం కోసం పరదాని కొంచెం పక్కకి జరిపే చొరవొచ్చి చేరింది. “అందం తడబడింది” అన్న అందమైన ప్రయోగం వేటూరిలోని కవిని చూపెడుతోంది. అమ్మాయి పెరిగిన మహమ్మదీయ వాతావరణాన్ని సూచించడానికి “పరదా” అని వాడాడు. 

ప్రేమలో పడ్డాక, అందం తొలికెరటమై ఉప్పొంగింది. తీయని ఊహల్లో తుళ్ళే మనసు ఆ కెరటానికి నీటి మెరుపులా అమరింది! ఎంత అందమైన ఊహ! అయితే వాస్తవంలోకి వస్తే ఈ ప్రేమ ఫలించడం ఎంత కష్టమో తెలిసి అదే మనసు సంఘర్షణకి గురౌతోంది.  అది ఎలా ఉందంటే గాలికి రెపరెపలాడుతున్న దీపం లాగ! ఇలా మనసు ఊగిసలాటని పాజిటివ్‌గా నెగిటివ్‌గా రెండు అద్భుతమైన ఉపమానాలతో చెప్పాడు. వెంటనే ఇంకో అందమైన ఉపమానం – గుండెలో నీలిమంట మూగిందట, తానొక పసిచినుకట, ఆ నీలిమంట దావాగ్నిలా మారితే ఆ పసిచినుకు గతేం కానూ? అని ప్రశ్న. ఇక్కడ మంట శృంగారపరమైన ప్రతీక కావొచ్చు, లేదా వేదనా/సంఘర్షణా కావొచ్చు. “మూగె నా గుండెలో నీలిమంట..” అని అర్థోక్తిలో వదిలెయ్యడం మంచి ఫీల్ ఇచ్చింది. ఈ మూడు ఉపమానాలనీ మనం ఇంకొన్ని విధాలుగా కూడా అన్వయించుకోవచ్చు, అదే ఇక్కడి అందం. 

శ్రుతి మించేటి పరువపు వేగం వేగం ఉయ్యాలలూగింది నీలో

తొలిపొంగుల్లొ దాగిన తాపం తాపం సయ్యాటలాడింది నాలో

ఎంత మైమరపో ఇన్ని ఊహల్లో తెల్లారె రేయల్లే

ఎడబాటనుకో ఎర్రమల్లెలో తేనీరు కన్నీరే

ఇది నిజమా కల నిజమా, గిల్లుకున్న జన్మనడిగా

నీ నమాజుల్లో ఓనమాలు మరిచా 

మొదటి చరణంలో ఆ అమ్మాయి తన అనుభూతినీ, పరిస్థితినీ వివరిస్తే రెండో చరణంలో “ఎందుకు ఇలా అయ్యింది”, “ఇప్పుడేం చెయ్యాలి” అన్న ఆలోచన కనిపిస్తుంది. ప్రేమ భావం ఎందుకు ఇంత తీవ్రంగా ఉంది అంటే – వయసు ప్రభావం అని సమాధానం! వయసు మాయలాడి, జగత్కిలాడి! అది అబ్బాయిని శ్రుతి మించి ఉయ్యాలలూగిస్తే, అమ్మాయిని గిలిగింతలు పెట్టి తాపాన్ని ఎగదోస్తోంది! ఈ తీయని ఊహల మైమరపులో, పగలు కూడా రేయిలా మారుతోందట. “తెల్లారె రేయల్లే” అన్న ప్రయోగం ఎంత చక్కగా ఉందో! అదే సమయంలో ఒకవేళ వియోగమే వస్తే బ్రతుకు విఫలమే కదా అన్న స్పృహ కలుగుతోంది. దీనిని “ఎర్రమల్లెల్లో తేనీరు కన్నీరవ్వడం” అన్నాడు! ఎంత కవిత్వం అండి. ప్రస్తుత మాధుర్యం పూలలో తేనె అయితే ప్రేమ వైఫల్యం రాలే పూల కన్నీరే కదా! “ఎర్రమల్లెలు” అంటే “ఎరుపు రంగులో ఉన్న ఓ రకం మల్లెలు” అన్న అర్థం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ “ఎరుపు” ని రక్తం/వేదనకీ లేక సిగ్గు/శృంగారానికి సూచికగా వాడినట్టు అనిపిస్తోంది. వేటూరి పాటల్లో తవ్వుకున్న వారికి తగినంత నీరు!

పాటని ముగించే ఆఖరి లైన్లు నాకు చాలా ఇష్టం. తరచి చూస్తే ఇదంతా కలా నిజమా అని ఆ అమ్మాయికి అనిపిస్తోంది. లేకపోతే తానేమిటి ఇలా అయిపోవడం ఏమిటి? ఈ ప్రేమని జయించి తీరకపోతే బ్రతుకు వృథా అనిపించేంత మాయ ఎలా జరిగింది? స్పృహలో ఉన్నామా కలలో ఉన్నామా తేల్చుకోడానికి చేతిని గిల్లి చూసుకుంటాం. అయితే ఆ అమ్మాయి తన బ్రతుకుని గిల్లి అడిగిందట! “గిల్లుకున్న జన్మనడిగా” – ఎంత అద్భుతమైన ప్రయోగం! ఇంకా ఈ తీయని ఊహల మైమరపులో భాషనే మరిచిపోయిందిట! ఈ భావాన్ని కూడా ఎంత అద్భుతంగా చెప్పాడండి – “నీ నమాజుల్లో ఓనమాలు మరిచా”. “నమాజు” అనడం ద్వారా అమ్మాయి ముస్లిం అన్న విషయం గుర్తు చేస్తూ, తనది కేవలం తీయని ఊహ కాదు, ఓ ఆరాధన, ఓ ప్రార్థన అని తెలియజేస్తున్నాడు! ఓనమాలు – అంటే అక్షరాలు అనే కాదు, “ఓం నమః” ని గుర్తుచెయ్యడం ద్వారా అబ్బాయి హైందత్వాన్ని కూడా స్ఫురింపజెయ్యడం. అంటే ఈ మతాల వైషమ్యాలు మరిచి, ఈ అడ్డుగోడలు దాటి ప్రేమని సాధించుకుందాం అని చెప్పడం! ఈ రెండు వాక్యాలకీ వేటూరికి దణ్ణం పెట్టొచ్చు అనిపిస్తుంది నాకు!

ఒక్కసారి ఈ పాటలో వాడిన ఉపమానాలు, పదచిత్రాలు అన్నీ ఊహించుకుంటూ ఈ పాట సాహిత్యాన్ని మళ్ళీ చదవండి. ఎంత గొప్ప సాహిత్యమో తెలుస్తుంది. నిజానికి ఇది డబ్బింగ్ పాట. తమిళ కవి వైరముత్తుకి కొంత క్రెడిట్ దక్కాలి. అయితే పాట తమిళ సాహిత్య అనువాదం చూస్తే వేటూరి తనదైన ఊపమానాలు, ప్రయోగాలు చేస్తూ అనుసృజన చేసాడు కానీ, అనువాదం చెయ్యలేదని తెలుస్తుంది. పైగా డబ్బింగ్ పాటల్లో సైతం చక్కని భాషా, చిక్కని కవిత్వం పలికించడం వేటూరికే తెలిసిన విద్య! వేటూరి గొప్ప డబ్బింగ్ పాటల రచయిత కాకపోవచ్చు కానీ, డబ్బింగ్ పాటలకి కూడా గొప్పతనం దక్కేలా చాలా మంచి రచనలు చేసాడనడానికి ఈ పాటే ఉదాహరణ!

(తొలి ప్రచురణ వేటూరి వెబ్సైటులో)

“స్నేహితుడా స్నేహితుడా” (సఖి) పాట గురించి

మణిరత్నం “సఖి” సినిమా తెలుగు లిరిక్స్ చెత్తగా ఉంటాయని చాలామంది భావన. ఆ సినిమా విడుదలైన కొత్తల్లో టీవీ ఏంకర్ ఝాన్సీ ఓ ప్రోగ్రాంలో “పాటలు బాగున్నాయి, అర్థమైతే ఇంకా బాగుండేది” అని వ్యంగ్యంగా అనడం నాకు బాగా గుర్తు. “పచ్చందనమే పచ్చందనమే నీ చిరునవ్వుల పచ్చదనమే” అన్నప్పుడు “ఏం పాపం, హీరోయిన్ పళ్ళుతోముకోలేదా” అని వెటకారం చేసినవాళ్ళు ఉన్నారు. ఇక రహ్మాన్ అభిమానులైతే, “మా రహ్మాన్‌కి ఎప్పుడూ ఇదే ఖర్మ తెలుగులో” అని వాపోయి తమిళ ఆల్బంకి స్విచ్చైపోయారు.

ఈ పరిస్థితికి గీతరచయిత వేటూరిని తప్పుపట్టొచ్చు. అయితే వేటూరినే పూర్తిగా నిందించడం సరికాదనిపిస్తుంది. పాట సాహిత్యం కొన్ని చోట్ల అంతగా వినబడకపోవడానికి, పాడిన వాళ్ళకి తెలుగు తెలియకపోవడం వల్ల జరిగిన పొరబాట్లకి రహ్మాన్‌ని తప్పుపట్టొచ్చు. వేటూరి మరీ క్లిష్టమైన తెలుగు వాడకపోయినా, “మునిమాపు” లాంటి తెలుగుపదాలు కూడా అర్ధం కానంతగా దిగజారిన మన తెలుగు భాషాసామర్ధ్యానికి మనని మనం నిందించుకోవాలి!

ఈ పాటని అర్థం చేసుకునే ముందు కొన్ని విషయాలు గమనించాలి. ఇదొక శృంగార గీతం. పెద్దలకి తెలియకుండా పెళ్ళిచేసుకున్న ఓ యువజంట రహస్యంగా కలుసుకున్నప్పుడు సాగే చిన్న చిన్న ముచ్చట్లన్నీ చిలిపిగా ఆ అమ్మాయి పాడుతోంది. తమిళంలో ఈ పాట రాసినది వైరముత్తు. వైరముత్తు సాహిత్యానికి translation ఇక్కడ చదవొచ్చు. వేటూరి తమిళపాట భావాన్నే దాదాపు అనుసరించినా తనదైన సొబగులని అద్దాడు.

సాకీ:

నిన్న మునిమాపుల్లో నిద్దరోవు నీ ఒళ్ళో
గాలల్లే తేలిపొతానో ఇలా డోలలూగేనో
ఆనందాల అర్ధరాత్రి అందాల గుర్తుల్లో నిన్ను వలపించా
మనం చెదిరి విలపించా
కురుల నొక్కుల్లో నలుపే చుక్కల్లో
గర్వమణిచెనులే నా గర్వమణిగెనులే

“మునిమాపు” అంటే సాయంసంధ్య వేళ. “డోల” అంటే “ఊయల”. “అందాల గుర్తులు” అంటే “శృంగార చిహ్నాలు” కావొచ్చు. “వలపించు” అంటే మోహింపజేయడం (fascinate).

భావం: నిన్న సాయంత్రపు వేళ మసకవెన్నెల్లో మనం కలుసుకున్నప్పుడు నా ఆనందానికి అంతులేదు. ఎంతో హాయిగా ప్రేమలో మునిగితేలాం. కానీ విడిపోవడం ఎంత బాధగా ఉంది! నీ కురుల నొక్కులో మెరిసే చుక్కలు సైతం నల్లబడ్డాయి సుమా. నీ సోయగానికి నేను దాసోహం!

భావపరంగా కొంత అస్పష్టత ఉంది. “మనం చెదిరి (నేను) విలపించా” అన్న వాక్య నిర్మాణం వేటూరిలో తరచూ కనిపించే నిర్లక్ష్యాన్ని చూపిస్తుంది.

పల్లవి:

స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా!
చిన్నచిన్న నా కోరికలే అల్లుకున్న స్నేహితుడా!
ఇదే సకలం సర్వం, ఇదే వలపూ గెలుపు,
శ్వాస తుదివరకూ వెలిగే వేదం వాంఛలన్ని వరమైన ప్రాణబంధం

భావం: ఓ ప్రియమైన రహస్య స్నేహితుడా! నాకు కొన్ని చిన్నచిన్న సరదా కోరికలున్నాయి, నీతో తీర్చుకుంటాలే! మన ప్రేమే మన గెలుపు, అదే సమస్తం. ప్రాణసమానమైన మన బంధం వేదంలాగ కడదాకా వెలుగుతూనే ఉంటుంది.

మొత్తం పాటలో పల్లవే మెరుస్తుంది. “పల్లవికి వేటూరి” అని మరోసారి నిరూపిస్తుంది. “కోరికలే అల్లుకున్న స్నేహితుడా”, “వాంచలన్ని వరమైన ప్రాణబంధం” వంటి expressions వేటూరిలోని కవిని, అతని పదాలపొందికని చూపిస్తాయి. కథాపరంగా ప్రేమకోసం పెద్దలకి తెలియకుండా పెళ్ళిచేసుకుని, రహస్యంగా కలుసుకుంటూ ఉంటారు కనుక – “ఇదే వలపూ గెలుపు” అనడం, “రహస్య స్నేహితుడా” అనడం పొసగుతుంది.

చరణం 1:

చిన్నచిన్న హద్దు మీర వచ్చునోయ్
ఈ జీవితాన పులకింత వెయ్యవోయ్
మనసే మధువోయ్
పువ్వు కోసే భక్తుడల్లే మెత్తగా
నేను నిద్రపోతే లేతగోళ్ళు గిల్లవోయ్
సందెల్లో తోడువోయ్
ఐదు వేళ్ళు తెరిచి, ఆవువెన్న పూసి సేవలు శాయవలెగా
ఇద్దరమొకటై కన్నీరైతే తుడిచే వేలందం!

మధువు అంటే తేనె. సందె అంటే సాయంకాలం.

భావం: ఓ ప్రియుడా! కొంచెం శ్రుతిమించి తియ్యతియ్యగా పులకింత కలిగించవోయ్. నేను నిద్రపోయినప్పుడు ప్రేమగా నా కాలిగోళ్ళు గిల్లాలి నువ్వు. ఇంకా నా అరచేతికి ఆవువెన్న రాసి నన్ను సేవించుకోవాలి మరి! ఎప్పుడైనా మనిద్దరం కన్నీరైనప్పుడు ఒకరినొకరం మృదువుగా ఓదార్చుకుందాం లే!

గాయని “పూల కొంత వెయ్యవోయ్” అని పాడింది కానీ, నాకు అది “పులకింత” అనిపిస్తుంది. “నా జీవితంలో ఆనందాన్ని నింపు” అనడానికి వేటూరి “జీవితాన పులకింత వెయ్యవోయ్” అని ప్రయోగించి ఉంటాడని నా ఊహ. “చెయ్యాలిగా” అనడానికి “శాయవలెగా” అనడం, ఎంతో లలితంగా, పాట మూడ్‌కి సరిపోయేలా ఉంది. ఈ ప్రయోగానికి “మా గురువుగారు పింగళి ప్రేరణ ఉందని” వేటూరే చెప్పారు (ఇక్కడ చూడండి).

“ఇద్దరమొకటై కన్నీరైతే తుడిచే వేలందం” అనడం మొదట్లో ఎబ్బెట్టుగా అనిపించినా తర్వాత తర్వాత నాకు చాలా నచ్చింది. “ఒకరికొకరై, మన బాధలని మనసు విప్పి చెప్పుకుని  సాంత్వన పొందుదాం” అన్న అర్థం వచ్చేలా గొప్పగా రాశాడనిపిస్తుంది. ముందులైనుతో కలిపి తీసుకుంటే ఇంకో భావమూ ధ్వనిస్తుంది. ఆవువెన్న మెత్తదనాన్నీ, మృదుత్వాన్నీ సూచిస్తోంది అనుకుంటే, “వెన్నతో నిండిన వేలితో కన్నీరు తుడవడం” అంటే అందంగా, మృదువుగా, సామరస్యంగా ఒకరి కన్నీరు ఒకరు తుడుద్దాం అన్న అర్థమూ వస్తుంది.

చరణం 2:

శాంతించాలి పగలేంటి పనికే
నీ సొంతానికి తెచ్చేదింక పడకే
వాలేపొద్దు వలపే
ఒళ్ళెంచక్కా ఆరబోసె వయసే
నీటి చెమ్మచెక్కలైనా నాకు వరసే
ఉప్పుమూటే అమ్మైనా
ఉన్నట్టుండి ఎత్తేస్తా, ఎత్తేసి విసిరేస్తా, కొంగుల్లో నిన్నే దాచేస్తా
వాలాక పొద్దు విడుదల చేసి వరమొకటడిగేస్తా

“చెమ్మచెక్కలు” అంటే అమ్మాయిలు ఆడుకునే ఓ ఆట. “నీటి చెమ్మచెక్కలు” అనడం వేటూరిజం. అంటే నీళ్ళల్లో ఆడుకునే సరసమైన ఆటలు అనుకోవచ్చు.

భావం: శ్రీవారూ, శాంతించాలి! పగటిపూట సరసాలు చాలించాలి! పొద్దు వాలి చీకటి పడ్డాక మనకి సొంతమైన సమయం ఉంది కదా! ఎంతైనా నా అందాల ఆరబోత తమరికేగా! నీళ్ళల్లో ఆటలకైనా నేను సై అంటాగా! మన ఉప్పుమూట ఆటల్లో నేను తమరిని ఎత్తిపడేసి, నా చీరకొంగులో దాచేస్తాను. చీకటి పడ్డాకే తమరికి విడుదల, అదీ నేనడిగిన వరాన్ని తీరిస్తేనే!

వేటూరి చిలిపిదనాన్ని ఈ చరణంలో చూడొచ్చు. “పని” అంటే వేటూరి పాటలోనే చెప్పాలంటే – “మీ పని, మీ చాటుపని, రసలీలలాడుకున్న రాజసాల పని”! (అన్నమయ్య చిత్రంలోని “అస్మదీయ మగటిమి” పాట).  “సొంతానికి తెచ్చేదింక పడకే” అనడం అందమైన తెలుగు నుడికారం. వయసు ఒంటిని ఎంచక్కా ఆరబోసింది అనడం, నీటి చెమ్మచెక్కలు నాకు వరసే అనడం ఎంత గడుసు ప్రయోగాలు! నిజానికి గాయని “ఉల్లంచొక్కా” అని పాడింది. తమిళగీతంలో కూడా “నీ చొక్కాలు నేను వేసుకుని నిన్ను అల్లరి పెడతాగా” అన్న భావం కనిపిస్తోంది. ఉల్లం అంటే “మనసు” కాబట్టి, “మనసనే చొక్కాని” నేను ఆరబోసాను అని ఒక అర్థం చెప్పుకోవచ్చు గానీ, నాకది అస్సలు సమంజసంగా అనిపించలేదు. చివరి లైనులో “వాలాక పొద్దు” అన్నది ట్యూనులో అంత సరిపడకపోవడంతో “వాలక పొద్దు” అని వినిపించి మనని అర్థం తెలియని గందరగోళంలోకి నెడుతుంది.

రెహ్మాన్ సంగీతం ఈ పాటకి గొప్పగా ఉంటుంది. “సాధనా సర్గం” కూడా బాగా పాడింది. ఈ వ్యాఖ్య వలన పాట సాహిత్యం కొంత మెరుగ్గా అర్థమయ్యి, పాటని మరింతగా ఆస్వాదిస్తారని ఆశిస్తాను.

నమ్మిన నా మది మంత్రాలయమేగా!

ఈ మధ్యే ప్రభాస్ నటించిన రాఘవేంద్ర చిత్రంలోని నమ్మిన నా మదిపాట విన్నాను. అంతక ముందు చాలా సార్లు విన్నాను. విన్న ప్రతిసారీ గొప్పగా అనిపించింది. “వేటూరి ఎంత బాగా రాశాడో” అనుకోగానే వేటూరి పుట్టినరోజు  దగ్గరలోనే ఉందని గుర్తొచ్చింది. అందుకే చాలా కాలం తర్వాత మళ్ళీ ఈ బ్లాగులో ఈ వ్యాఖ్యానం.

ఈ పాట మంత్రాలయ రాఘవేంద్రస్వామిని స్తుతిస్తూ సాగినా ఒక భక్తుడు భగవంతునికి తనను తాను ఆర్తిగా నివేదించుకోవడమే నాకు కనిపిస్తుంది. అందుకే ఈ పాటని ఎవరికి వారు తమ అనుభవాలతో కనెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెయ్యబోయే వ్యాఖ్యానం కూడా ఈ కోణంలోనే సాగుతుంది.

ముందుగా పాట సాహిత్యం:

నమ్మిన నా మది మంత్రాలయమేగా

నమ్మని వారికి తాపత్రయమేగా

శ్రీగురుబోధలు అమృతమయమేగా

చల్లని చూపులు సూర్యోదయమేగా

గురునాథ రాఘవేంద్ర శ్రీకృష్ణ పారిజాతా

హనుమంత శక్తిసాంద్రా

హరినామ గానగీతా

నీ తుంగభద్ర మా పాపాలే కడగంగా

తుంగాజలాల సేవ తులసీదళాల పూజ అందుకో

చరణం : 1

నిరాశ మూగేవేళా మా దురాశ రేగేవేళా

నీ భజనే మా బ్రతుకైపోనీవా

పదాలవాలే వేళ నీ పదాలు పాడే వేళ

నీ చరణం మా శరణం కానీవా

మనసు చల్లని హిమవంతా

భవము తీర్చరా భగవంతా

మహిని దాల్చిన మహిమంతా

మరల చూపుమా హనుమంతా

నీ వీణతీగలో యోగాలే పలుకంగా

తుంగాజలాల సేవ తులసీదళాల పూజ అందుకో

చరణం : 2

వినాశ కాలంలోన ధనాశపుడితే లోన

నీ పిలుపే మా మరుపై పోతుంటే

వయస్సు పాడేవేళా వసంతమాడే వేళా

నీ తలపే మా తలుపే మూస్తుంటే

వెలుగు చూపరా గురునాథా

వెతలు తీర్చరా యతిరాజా

ఇహము బాపి నీ హితబోధ

పరము చూపె నీ ప్రియగాథ

నీ నామగానమే ప్రాణాలై పలుకంగా

తుంగాజలాల సేవ తులసీదళాల పూజ అందుకో

నమ్మిన నా మది మంత్రాలయమేగా

నమ్మని వారికి తాపత్రయమేగా

మొత్తం పాటలో విషయాన్ని రెండు వాక్యాల్లో గొప్పగా చెప్పారు వేటూరి. మంత్రాలయ రాఘవేంద్రస్వామిని నమ్మిన వారికి ముక్తి, నమ్మని నాస్తికులకి ఏ ప్రాప్తమూ లేదని చెప్పడం వేటూరి ఉద్దేశ్యం కాదు. ఇక్కడ నమ్మకం అంటే కేవలం belief కాదు. నీలోని అహాన్ని పక్కన పెట్టి నిన్ను నీవు సమర్పించుకోవడం. సమర్పణం అన్నది ముఖ్యమైన విషయం, ఎవరికి సమర్పించుకుంటున్నావు అన్నది కాదు. ఇది అంత సులువైనది ఏమీ కాదు. ఓ ఘడియో, ఐదు నిమిషాలో ఆ స్థితిలో ఉండగలిగితే గొప్ప విషయమే. ఆ కొద్దిసేపైనా మనసు భగవంతుని నిలయంగా,  మంత్రాలయంగా మారుతుంది.  నదిలో ఈదే చేపకి నీటి గురించి తెలుస్తుంది తప్ప ఒడ్డున కూర్చుని తర్కించే మేథావులకి కాదు. అలాగే భగవంతుడిని కేవలం కోర్కెలు తీర్చే కల్పవృక్షంగా భావించి పూజించే భక్తులకి నిజమైన భక్తిభావం అంటే తెలియదు. మన తాపత్రయంలో మనమున్నప్పుడు భగవంతుడు మన చెంతకి ఎందుకు రావాలట అసలు?

తుంగాజలాల సేవ తులసీదళాల పూజ అందుకో 

పాటలో “తుంగాదళాల” సేవ అని తప్పుగా వినిపిస్తుంది, కానీ అది “తుంగాజలాల సేవ”. మంత్రాలయ బృందావన క్షేత్రం తుంగభద్ర నదీ తీరంలో ఉంది కాబట్టి వేటూరి తుంగభద్రని ప్రస్తావించారు.  పాట మొత్తంలో శ్రీ రాఘవేంద్రస్వామికి సంబంధించిన ఎన్నో విశేషాలని వేటూరి ప్రస్తుతిస్తారు. వాటి గురించి బాగా తెలిసిన వారెవరైనా వ్యాఖ్యానిస్తే బాగుంటుంది.

నిరాశ మూగేవేళా మా దురాశ రేగేవేళా నీ భజనే మా బ్రతుకైపోనీవా

శోకంలో కూరుకుపోయిన వాళ్ళకి భగవంతుడు గుర్తుకు రావడం సహజం. అయితే నిరాశ తోడైతే మాత్రం భగవంతుడూ గుర్తుకు రాడు. నిరాశలో ఉన్న వాడికి దైవసహాయంపైన కూడా ఆసక్తి ఉండదు. అలాగే ఏదైనా కానిది/తగనిది/అనవసరమైనది పొందలానే దురాశ పుట్టినప్పుడు కూడా మన అహంలో, అహంకారంలో, అజ్ఞానంలో మనముంటాం తప్ప దేవుడు గుర్తుకు రాడు. ఈ రెండు స్థితుల్లోనూ చేజారిపోనీక మమ్ము పట్టుకు నడిపించు ప్రభూ అని వేడుకోవడం.

పదాలవాలే వేళ నీ పదాలు పాడే వేళ

నీ చరణం మా శరణం కానీవా 

గుడికి వెళ్తే దేవుని పాదాలపై వాలి మొక్కుకుంటాం. పాటలు (పదాలు) పాడతాం.  తలవంచి నమస్కరించినప్పుడు కాసేపైనా మన అహంకారం తలవంచిందా? పాట పాడినప్పుడు నిమగ్నమయ్యామా లేక పొగడ్తలకోసమో, ప్రశంసల కోసమో పాకులాడేమా? అందుకే నీ చరణాలే నాకు శరణమనే శరణాగతి ప్రసాదించమని ప్రార్థన.

భవము తీర్చరా భగవంతా 

భవము అంటే పుట్టుక అని అర్థం తీసుకుంటే, మళ్ళీ పుట్టుక లేకుండా చెయ్యమని వేడుకోవడం కనిపిస్తుంది. ఆశానిరాశలు, సుఖదుఖాలు మొదలైన ద్వంద్వాలన్నీ మనసు చేసే కల్పనలే. ఇవే బంధనాలై, రుణాలై, ఇంధనాలై “రేపుని” సృష్టిస్తాయి. ఈ “కర్మ” తప్పాలంటే ద్వంద్వాలకి అతీతమైన స్థితిని పొందాల్సి ఉంటుంది. అంటే మనసు పరిధిని దాటి అనంతంలోకి దూకడం అన్నమాట. “మరుజన్మ” లేకపోవడం అంటే ఇదే!

మహిని దాల్చిన మహిమంతా

మరల చూపుమా హనుమంతా

మహిమలు చూపడంలో ఉద్దేశ్యం తన గొప్పతనాన్ని చాటుకోవడం కాదు, మనలోని అల్పత్వాన్ని తెలియపరచడం.   అందుకే నీ మహిమలన్నీ మళ్ళీ చూపి మాలోని అల్పత్వాన్ని ఎరుకజెయ్యి స్వామీ అని ప్రార్థన.

వినాశ కాలంలోన ధనాశపుడితే లోన

నీ పిలుపే మా మరుపై పోతుంటే

వయస్సు పాడేవేళా వసంతమాడే వేళా

నీ తలపే మా తలుపే మూస్తుంటే 

ఇక్కడ రెండు ప్రలోభాలని ప్రస్తావిస్తున్నారు. ఒకటి కాంక్ష, రెండవది వయసు. ఈ రెండూ తోడు స్నేహితులు కూడా! ఒక తీవ్రమైన వాంఛ, అది ధనం మీద కావొచ్చు, కీర్తి మీద కావొచ్చు లేక మరి దేనిమేదైనా కావొచ్చు, అది “నీలోని నిన్ను” వృద్ధి చేస్తున్నంత వరకూ అది వినాశహేతువే. అలాగే వయసూ, వేగం, శక్తీ ఉన్నప్పుడు ఆ మత్తులో మనం చేసే ప్రతీదీ గొప్పగానే కనిపిస్తుంది. ఈ రెండు స్థితుల్లోనూ వినమ్రత, ఎరుక కలిగి ఉండడం కష్టమే. అందుకే మము కాచి వెలుగు చూపమని ప్రార్థించడం. మనకి తెలిసిన ఈ “ఇహము” కొన్ని సార్లు ప్రియమైనా, కొన్ని సార్లు అప్రియమైనా మనం దాన్ని పట్టుకుని వేలాడుతూనే ఉంటాం. ఈ జంజాటం నుంచి విడిపించి పరతత్త్వాన్ని ప్రసాదించమని వినతి.

ఈ పాట నిండా పరుచుకున్న భక్తితత్త్వం మైమరపింపజేస్తుంది. మణిశర్మ చాలా చక్కటి బాణీ అందించాడు (పాటని ఇక్కడ వినొచ్చు – http://www.raaga.com/play/?id=9132). ఈ బాణీలోని శక్తి వేటూరికి గొప్ప ప్రేరణని ఇచ్చిందని చెప్పడానికి ఆయన ఈ పాటలో చేసిన శబ్దార్థ ప్రయోగాలే నిదర్శనం. లీనమైన కొద్దీ లోతు తెలిసే పాట ఇది. వేటూరి లేని లోటుని తెలిపే పాట కూడా.

చినుకులన్నీ కలిసి చిత్రకావేరి

శుభసంకల్పం చిత్రంలోని “చినుకులన్నీ కలిసి చిత్రకావేరి అన్న పాట వేటూరి కవిత్వపు లోతులని తెలిపే గొప్ప పాటని సిరివెన్నెల సీతారామశాస్త్రే స్వయంగా మెచ్చుకున్నారు -(హాసంలోని వ్యాసం ఇక్కడ)

“చినుకులన్నీ కలిసి చిత్రకావేరి, చివరికా కావేరి కడలి దేవేరి” అని కనురెప్పల చెలియలికట్టని దాటని కన్నీటిపొర వెనుకనున్న గుండెకడలి కల్లోలాన్ని చూపించారు”

ఓహో, గొప్ప పాటన్న మాట అనుకోవడమే తప్ప పాటలో గొప్పతనమేమిటో, ఆ మాటకొస్తే అసలు పాటకు అర్థం ఏమిటో నాకు మొదట అర్థం కాలేదు. ఇప్పటికీ పూర్తిగా అర్థం కాలేదు, కానీ గొప్పతనాన్ని కొంత గ్రహించాను అని చెప్పగలను. Veturi is a poet’s poet కనుక సిరివెన్నెల వంటి వారికి అర్థమైనంత నాబోటి వారికి అర్థం కాదు. ఐనా నాకర్థమైనంతలో ఈ పాట గురించి వివరిస్తాను.

సినిమాలో కథానాయకుడు (కమల్ హాసన్) ఓ జాలరి. అతనికో చక్కని భార్య (ఆమని), వారిదో ముచ్చైటైన జంట. అనుకోని పరిస్థితులలో అతని భార్య తీవ్రమైన అపాయానికి లోనై ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రికి చేరుతుంది. కొన్నాళ్ళు మృత్యువుతో పోరాడి, తుదిశ్వాస విడుస్తుంది. అప్పుడు కథానాయకుడు, భార్య శవాన్ని పడవలో వేసుకుని, నది మధ్యకి తీసుకెళ్ళి, పడవని ఆపి భోరున విలపిస్తుండగా వచ్చే నేపథ్య గీతం ఇది. కాబట్టి ఇదొక శోక గీతం అనుకోవాలి.

అయితే సినిమా ట్రైలర్స్ చూసినప్పుడు నాకు బాగా జ్ఞాపకం – సముద్రపు ఒడ్డున కథానాయకుడు భార్యతో ఆనందంగా కనిపిస్తాడు. భార్య అతని పైన వాలి, ప్రేమగా అతని ఎద నిమురుతూ ఇదే పాట పాడుతుంది. ఈ సన్నివేశం మరి చిత్రంలో ఉందో లేదో గుర్తులేదు. అయితే వేటూరి ఈ పాటని శోకగీతంగా మాత్రమే కాక, ఇంకో అర్థం స్ఫురించేలా కూడా రాశారని అనుకోవచ్చు. అంటే ఈ పాటకి రెండు అర్థాలు ఉన్నాయన్న మాట. అదే మరి వేటూరి గొప్పతనం అంటే.

మొదటి అర్థం:

కథానాయకుడు జాలరి కాబట్టి చేపలు పట్టడానికి రోజుల తరబడి సముద్రంకేసి పోవడం సహజం. పెళ్ళాం పిల్లలని వదిలి ఇలా ఉండడం కొంత ఒంటరితనాన్ని వారిలో కలగజేస్తుందనీ, అందుకే వారు పాడుకునే పాటల్లో శృంగారం ఎక్కువ కనిపిస్తుందని యండమూరి వీరేంద్రనాథ్ ఒకచోట రాశారు. కాబట్టి సముద్రం కేసి వెళుతున్న మొగుడుని, ప్రేమగా సముదాయిస్తూ అతని భార్య ఈ పాట పాడుతోందని అనుకోవచ్చు. ఈ కోణంలో ఈ పాట అర్థాన్ని పరిశీలిద్దాం.

చినుకులన్నీ కలిసి చిత్రకావేరి

చివరికా కావేరి కడలి దేవేరి

కడలిలో వెతకొద్దు కావేరి నీరు

కడుపులో వెతకొద్ది కన్నీరు కారు

గుండెలోనే ఉంది గుట్టుగా గంగ, నీ గంగ

ఎండమావుల మీద ఎందుకా బెంగ?

రేవుతో నావమ్మ కెన్ని ఊగిసలో

నీవుతో నాకన్ని నీటి (కన్నీటి) ఊయలలు

“చిత్రకావేరి” అంటే తనే, కడలి అంటే జాలరి ఐన భర్త. నేను నీకు భార్యనయ్యాను. సముద్రంలో ఉన్నప్పుడు నన్ను గుర్తుచేసుకుని, నేను చెంత లేనని కలతపడకు. నేను నీ గుండెలోనే ఉన్నాను, నీకు తెలియదా ? (సినిమాలో కథానాయిక పేరు కూడా “గంగ”). నేను నీ చెంతనుండగా, ఏ ఎండమావులూ మన దరిజేరవు. రేవుతో నావకిమల్లే నీతో నాకు ఎన్నో నీటి ఊయల సయ్యాటలు!

రెండవ అర్థం:


ఇలా ఆనందంగా, సరస సల్లాపాలతో సాగుతున్న వారి జీవితాన్నీ, వారి అనుబంధాన్ని ప్రతిబింబిస్తుందీ పాట. అయితే విధివశాత్తూ భార్య చనిపోతుంది. అప్పుడు కథానాయకుడు భార్య పాడిన పాటని గుర్తు చేసుకుంటున్నాడు. ఇప్పుడు అతనికి అదే పాటలో కొత్త అర్థాలు స్ఫురిస్తున్నాయి.

కావేరి చివరికి కడలిలో కలిసిపోయినట్టే, ప్రతి మనిషీ కాలగర్భంలో కలిసిపోక తప్పదు. కడలిలో కలిశాక ఇంక కావేరి అంటూ ఏముంది? (కడలిని కలిసే వరకే కావేరికి రూపు ఉన్నది అన్నారు వేటూరి ఇంకో పాటలో). నేను ఒక కరిగిపోయిన జ్ఞాపకం. నన్నే తలుచుకుంటూ శోకంలో కూరుకుపోకు. ఐనా నేను ఎక్కడికీ వెళ్ళిపోలేదు, నీ గుండెలోనే సజీవంగా ఉన్నాను. రేవుతో నావకి ఉన్న బంధంలాగే, నీకూ నాకూ మధ్య ఎన్నో కన్నీటి ఊయల పాటలు.

“నీటి ఊయలలు” అని మొదట పాడి, రెండో సారి “కన్నీటి ఊయలలు” అని బాలు పాడడం వల్ల మనకి మొదటి సందర్భం కూడా గుర్తొచ్చి, భావాన్ని గుండెకి హత్తుకుపోయేలా చేస్తుంది. మొదటి సందర్భంలో ఈ పాట శైలజ పాడినట్లు గుర్తు.

ఈ పాటని వ్యాఖ్యానించడం చాలా కష్టం. పాటకి అర్థం మనలో మనమే వెతుక్కోవాలి. ఈ పాట సాహిత్యాన్ని చదివి (లేదా పాటను విని), అంతర్ముఖులమై మౌనంలోకి ఒదిగిపోగలిగితే ఎంతో కొంత అర్థమౌతుంది. “భాష ఉన్నది మనకి మౌనాన్ని పరిచయం చెయ్యడానికే” అని సీతారామశాస్త్రి గారు ఒకసారి మా మిత్రబృందంతో అన్నది ఇదే కావొచ్చు.

అసలు ఈ పాటకి ఇంత అర్థం ఏమీ లేదు, మనమే కల్పించాం అని కొందరు అనవచ్చు. సృజన అన్నది కవి హృదయంలోనే కాక, పాఠకుడి హృదయంలోనూ కలిగేలా ప్రేరేపించడమే కవిత్వం ఉద్దేశ్యం. కవి సృజనా, చదువరి సృజనా ఒకటే కానక్కరలేదు, కాలేదు కూడా. “నాలో ఉన్న నీరు నాకు కాక ఇంకెవరికి తెలుసు? అన్న ఆత్రేయ/కణ్ణదాసన్ వాక్యాలు ఇదే చెబుతాయి. నీలోని మరో నిన్ను నిదురలేపేదే కవిత్వం. అందుకే వేటూరి నిస్సందేహంగా మహాకవి.

వేటూరి పాటలో ఏముంది?

రంజని” సాహితీ సంస్థ వారు వేటూరి స్మృతిగా “పాటల పూదోట వేటూరి” అని ఒక పుస్తకం వెలువరించారు. వేటూరికి నివాళిగా రాసిన వ్యాసాల సంకలనం ఈ పుస్తకం. కొన్ని వ్యాసాల్లో వేటూరి పాటలకి ఇచ్చిన వివరణలు వేటూరి జన్మదినం సందర్భంగా అందరితో పంచుకునే ప్రయత్నమే ఈ వ్యాసం.

ఫ్రెంచి ఫిడేలు

ఒకసారి తనికెళ్ళ భరణి గారితో కలిసి నేనూ కొంతమంది మిత్రులం కార్లో రాజమండ్రి వెళుతున్నాం. వేటూరి గారి ప్రస్తావన వచ్చింది. “ఆ అంటే అమలాపురం” పాట పైకి వ్యాంప్ సాంగ్‌లా ఉన్నా లోపల ఎంతో చరిత్ర ఉందని నేనన్నాను. ఉదాహరణకి రాజమండ్రిని ప్రస్తావిస్తూ “చిత్రాంగి మేడల చీకట్ల వాడలో” అని ప్రయోగించారు వేటూరి. ఇది సారంగధ కథకు సంబంధించిన ప్రయోగం. అట్లే అదే పాటలో యానాం దగ్గర ఫ్రెంచి ఫిడేలు అనే పదం ప్రయోగించారు వేటూరి.

చారిత్రకంగా యానాం క్రీ.శ.1720లో ఫ్రెంచి వారి పాలనలోకి వెళ్ళింది కాబట్టి దాని ఆధారంగా వేటూరి “ఫ్రెంచి ఫిడేలు” అనే పదాన్ని ప్రయోగించారని నేనన్నాను. “అది కాకపోవచ్చయ్యా” అంటూ తనికెళ్ళ భరణి ఫోనందుకుని వేటూరి గారికే స్వయంగా ఫోన్ చేసి “గురువుగారూ, మీరు వాడిన ఫ్రెంచి ఫిడేలుకి అర్థమేంటి? మా వాడేదో చరిత్ర అంటున్నాడు” అని అడిగారు. భరణి గారు లౌడ్ స్పీకర్ ఆన్ చేశారు. అటునుండి మెల్లగా మార్దవంగా ఆ పుంభావ సరస్వతి మంద్ర స్వరంతో – “ఏముంది నాయనా. మనం చిన్నప్పుడు బళ్ళో చదువుకొనేటప్పుడు జేబుల్లో చేతులు పెట్టుకుని ఇబ్బందిగా చూస్తే “ఫిడేలు వాయిస్తున్నాడ్రా” అంటూ ఉండేవారు కదా” అంటూ చల్లగా చెప్పారు వేటూరి. ఇదీ వేటూరి విశ్వరూపమంటే

ఆకెళ్ళ రాఘవేంద్ర, “గోదారమ్మ కుంకుంబొట్టు” వ్యాసం

(సారంగధ కథ ఏమిటో, ఈ ఫ్రెంచి ఫిడేలు అర్థం ఏమిటో నాకు ఇంకా తెలియలేదు. మీకు తెలిస్తే కామెంట్లో చెప్పగలరు)
నవమి నాటి వెన్నెల

నవమి నాటి వెన్నెల నీవు
దశమి నాటి జాబిలి నేను
కలుసుకున్న ప్రతి రేయీ
కార్తీక పున్నమి రేయి

ఈ చిత్రంలో కథాపరంగా హీరోయిన్ జయసుధ కొత్త కుర్రాడైన హీరో కంటే పెద్దది కాబట్టి ఆమెను ముందుపుట్టిన నవమి నాటి వెన్నెలతో పోల్చి గూఢార్థంతో గుండెలకు అద్దారు వేటూరి.

వడ్డేపల్లి కృష్ణ, “సాటిలేని మేటి భావాల స్ఫూర్తి వేటూరి సుందరరామమూర్తి” వ్యాసం

యంగోత్రి, ఖంగోత్రి

ఒక విద్యార్థిని ప్రశ్న: మీరొక పాటలో యంగోత్రి, ఖంగోత్రి అనే కొత్త మాటలు ఉపయోగించారు. వాటిని ఎందుకు ఉపయోగించారు. వాటి అర్థం ఏమిటి?

వేటూరి: ఇవి అర్థం కాని పదాలు కావు. “యంగోత్రి” అంటే కుర్రదనీ, “ఖంగోత్రి” అంటే “కంగారుపడే యువతి” అనీ అర్థం. కొత్తపదాలు సృజించకుండా ఉంటే భాష ఎలా వృద్ధి చెందుతుంది? “మాయాబజారు”లో పింగళి గారు ఘటోత్కచుడి చేత “వెయ్యండయ్యా వీరతాడు” అనిపిస్తాడు. అలా కొత్తమాటలు పుట్టిస్తూ ఉండాలి. ఇప్పుడొస్తున్న కొత్త ట్యూన్లకి, కొత్త పద్ధతులకీ కొన్ని విన్యాసాలు తప్పనిసరి. “సావిత్రి” అనే పదం ఉందనుకోండి, ఆ పదాన్ని ఉపయోగించుకుని, “చలి సావిత్రి”, “సందిట్లో చలిసావిత్రి” అనే ప్రయోగాలు చేశాం. ఘన సంస్కృతికి సంబంధించిన నామవాచకంతో కొన్ని పదాలు కలిసినప్పుడు ఆ చమత్కారాలు నిలబడతాయి. యంగోత్రి, ఖంగోత్రి అంటే అక్కడ “త్రి” అనేది అంత్యప్రాసగా వస్తోంది. నడక కలిసిన నవరాత్రి అని వస్తుందనుకుంటాను – త్రి, త్రి అని రావడం వల్ల చమత్కారంగా ఉంటుంది కాబట్టి కొత్త పదాలు పడ్డాయి.

వేటురితో కళాశాల విద్యార్థినుల ఇంటర్వ్యూ వ్యాసం

బావరో బావర్చి

ఒకసారి నేను గురువుగారితో కలిసి హైదరాబాద్‌లో కారులో వెళ్తున్నాను. “ఇంద్ర” సినిమాకు అర్జెంటుగా పాట రాసివ్వాలి. అవతల ఒత్తిడి. ఈ ట్రాఫిక్ నుంచి బయటపడేదెప్పుడు? గురువు గారు పాట రాసేదెప్పుడు? నాకు ఒకటే టెన్షన్. నల్లకుంట నుంచి చిక్కడపల్లి మా ప్రయాణం. “తేజ గారూ (నన్ను అలాగే పిలిచేవారు), పాట ఫస్ట్ లైన్ రాసుకోండి అంటూ “అమ్మడూ అప్పచ్చీ, నువ్వంటేనే పిచ్చి” అన్నారు. నేను స్టన్ అయ్యాను. రెండో లైను చెబుతారేమోనని నేను ఆసక్తిగా చూస్తున్నాను. బావర్చీ హోటల్ దగ్గర ట్రాఫిక్ స్తంభించిపోయింది. గురువుగారు అటువైపు చూస్తూ “బావర్చి అంటే తెలుసా?” అన్నారు. “తెలియదు గురువుగారు” అన్నాను. బావర్చి అంటే వంటవాడు అన్నారాయన. ఇప్పుడెందుకు ఈ ప్రస్తావన అనుకున్నాను. అంతలోనే ఆయన – ఇప్పుడు రెండో లైను రాసుకోమంటూ “బావరో బావర్చి, వడ్డించు వార్చి” అనేశారు. నాకు నోట మాట రాలేదు. ఆ పాట ఎంత హిట్ అయ్యిందో అందరికీ తెలుసు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే పాట రాయడానికి ఆయన ప్రత్యేకించి సమయం తీసుకోరు. ఎంతమందిలో ఉన్నా, ఎక్కడున్నా ఆయన మనసంతా పాటై పరవళ్ళు తొక్కుతున్నప్పుడు, మళ్ళీ ప్రత్యేకించి సమయం కావాలా? అనుకున్నాను.

వేటూరి శిష్యుడు ధర్మతేజ, “దొరకునా ఇటువంటి సేవ” వ్యాసం

“ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమె నీవు” అని అన్నమయ్య ఒక కీర్తనలో అన్నాడు. ఇది వేటూరికీ వర్తిస్తుంది. కొన్ని సార్లు ఆయన చాలా అల్పుడనిపిస్తాడు, అంతలోనే మహోన్నతుడనిపిస్తాడు. “గంగిగోవు పాలు గరిటెడైనా చాలు” అనుకుని ఆయన గొప్ప గీతాలని మనసుకి హత్తుకున్నప్పుడల్లా కలిగే స్పందన అనిర్వచనీయం. అందుకే ఆయన మహాకవి. ఆయనకి అంజలి ఘటిస్తూ, ఆయన్నుంచి ప్రేరణ పొందుతూ, “పాటై బ్రతుకైన పసివాడికి” వినమ్రంగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను.